వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో జగన్ తెలుసుకోవాలి: మంత్రి పార్థసారథి

  • బెదిరించడం, కక్ష కట్టడం జగన్ నైజమన్న పార్థసారథి
  • రోజా అన్నీ గాలి మాటలే మాట్లాడతారని విమర్శ
  • కూటమి ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తోందన్న మంత్రి
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో జగన్ తెలుసుకోవాలని అన్నారు. బెదిరించడం, కక్ష కట్టడం జగన్ నైజమని చెప్పారు. ఎన్నికల గురించి జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? అని ప్రశ్నించారు.

సంక్రాంతి కేవలం కూటమి నేతలకే అని వైసీపీ నేతలు అంటున్నారని... సంక్రాంతి ఎవరికి అనేది అర్థం లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పార్థసారథి విమర్శించారు. మాజీ మంత్రి రోజా అన్నీ గాలి మాటలు మాట్లాడతారని వ్యాఖ్యానించారు.  

కూటమి ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. అన్న క్యాంటీన్లను  ఏర్పాటు చేసి రూ. 5కే పేదల ఆకలి తీరుస్తున్నామని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల భయాలను పోగొట్టామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామాలకు సిమెంట్ రోడ్లు వచ్చాయని చెప్పారు. 

వైసీపీ పాలనలో రూ. 6,679 కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తే... కూటమి ప్రభుత్వ పాలనలో 6 నెలల్లోనే రూ. 85 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దపెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రూ. 65 వేల కోట్లతో సీబీజీ ప్లాంట్లు పెట్టడానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. ఇక, నూజివీడులో గ్రావెల్ తవ్వకాలపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సమాచార లోపంతో మాట్లాడి ఉంటారని చెప్పారు.

Kolusu Parthasarathy
Telugudesam
Jagan
YSRCP

More Telugu News